హుజరాబాద్/ మార్చ్ 15 (మా అక్షరం): కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని హుజురాబాద్ డివిజన్ ఏసీపీ కార్యాలయాన్ని శనివారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కార్యాలయంలో గల పెండింగ్ కేసులపై అడిగి తెలుసుకున్నారు.త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు.అర్బన్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.రౌడీ షీటర్లు,హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు.ప్రతి నెల వారికి సంబందించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలన్నారు.సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నందున, వాటి బారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. పెండింగ్ వారెంట్ల అమలు చేయాలన్నారు.రోడ్డు ప్రమాదాలపై చర్చించారు. తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ హోల్స్ గా గుర్తించి, రోడ్డు ప్రమాదాల నివారణకై చర్యలు చేపట్టాలన్నారు.గంజాయి రవాణా, అక్రమ ఇసుక రవాణా,పి.డి.ఎస్. బియ్యం,పేకాట స్థావరాలను గుర్తించి ఆడేవారిని పట్టుకోవడం, వంటి వాటిని గుర్తించి తగిన కేసులు నమోదు చేసి, వాటిపై ఉక్కుపాదం మోపాలన్నారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జి, హుజురాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ జి తిరుమల్ తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.











