-పనుల ధరల పెంపు, వృత్తి రక్షణకై హుజూరాబాద్ విశ్వకర్మ మనుమయ సంఘం నిర్ణయం..
-20వ తేదీన శాంతియుత ర్యాలీ..
హుజూరాబాద్ /జులై 17 (మా అక్షరం):ప్రస్తుత జీవన విధానంలో రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, కార్పొరేట్ కంపెనీల పోటీ కారణంగా విశ్వకర్మల వృత్తి తీవ్ర భారంగా మారిందని, ఉపాధి లేక కులవృత్తి దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విశ్వకర్మ మనుమయ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. హుజురాబాద్ ప్రెస్ క్లబ్ లో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ…విశ్వకర్మల సమస్యల పరిష్కారం, సంఘం అభివృద్ధి, పనుల రేట్లను పెంచుకునేందుకు గానూ ఈ నెల 18 (శనివారం) నుండి 20 (సోమవారం) వరకు మూడు రోజుల పాటు సామూహిక బంద్ నిర్వహించనున్నట్లు సంఘం పట్టణ అధ్యక్షులు నందగిరి శ్రీనివాస్ తెలిపారు. హుజూరాబాద్ పట్టణ సంఘం అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు కీలక తీర్మానం చేసినట్లు తెలిపారు.ఈ బంద్ సందర్భంగా జూలై 18వ తేదీన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ నిర్ణయించిన నూతన ధరల పట్టికను అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే బంద్ ముగింపు రోజైన జూలై 20వ తేదీన విశ్వకర్మల సమస్యలపై శాంతియుత ర్యాలీ నిర్వహించనున్నట్లు వివరించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు..
సంఘం నిర్ణయించిన ఈ బంద్కు విశ్వకర్మ సోదరులందరూ తప్పనిసరిగా సహకరించాలని, ఎవరైనా సంఘం నిర్ణయాన్ని ధిక్కరించి పనులు చేపడితే వారిపై సంఘం పరంగా కఠిన చర్యలు ఉంటాయని అధ్యక్షులు నందగిరి శ్రీనివాస్, సంఘ కమిటీ సభ్యులు హెచ్చరించారు. బంద్ను విజయవంతం చేసి విశ్వకర్మల ఐక్యతను చాటాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విశ్వకర్మ మనుమయ సంఘం నాయకులు రావుల వేణు,రాంపల్లి బిక్షపతి, నాయకులు బాణాల వివేకానందచారి, పంచకోత సత్యనారాయణ,ఎదులాపురం సదానందం,సజ్జనపు రవీందర్,చల్లూరి రమేష్, ఉప్పల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.












