హుజురాబాద్/ జూలై 11( మా అక్షరం): పట్టణంలోని ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో ఉన్న ఓ బావిలో మహిళ మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. మృతురాలిని చింత సునీతగా పోలీసులు గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం, మామిండ్లవాడకు చెందిన ముత్తొజు భాగ్య శనివారం ఉదయం తన ఇంటి ఆవరణలోని బావిలో నీటిని తోడేందుకు వెళ్లగా మృతదేహం కనిపించింది. వెంటనే స్థానికులు, పోలీసులకు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.
మృతురాలు కేవలం కుర్తా (టాప్) మాత్రమే ధరించి ఉండగా, మెడకు నలుపు రంగు చీర కొంగు బిగించి ఉండడం, ముఖం, పెదవులపై గాయాల ఆనవాళ్లు ఉండడంతో హత్య చేసి బావిలో పడేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సునీత తొలి భర్త మరణించగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత ఐదేళ్లుగా మోతే కిరణ్తో సహజీవనం చేస్తూ ఘటనాస్థలానికి సమీపంలోని అద్దె ఇంటిలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. శుక్రవారం రాత్రి కూడా ఇద్దరూ కలిసి ఉన్నారని, తాను మద్యం సేవించి నిద్రపోయానని, ఉదయం లేచే సరికి సునీత కనిపించలేదని కిరణ్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం.స్థానిక కౌన్సిలర్ భర్త బండ నవీన్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ టి. కరుణాకర్ తెలిపారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ మాధవి పరిశీలించగా, డాగ్ స్క్వాడ్తోనూ ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నివేదికతో పాటు పూర్తి విచారణ అనంతరం మరణానికి గల కారణాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.












