హుజూరాబాద్/జూన్ 21(మా అక్షరం): పట్టణంలోని ఆర్టీసీ బస్స్టాండ్ను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. బస్స్టేషన్లో ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. బస్సుల సమయపాలన, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, ప్రయాణికులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.బస్స్టేషన్ పరిసరాలను పరిశీలించిన మంత్రి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బస్సుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాకుండా, వారిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అన్ని రంగాల్లో మహిళలు స్వయం సమృద్ధి సాధించేలా అవసరమైన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.












