-బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి..
బీజేపీ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు…
హుజురాబాద్/ జూన్ 10 (మా అక్షరం): పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల ఆవరణలోని విలువైన ప్రభుత్వ భూమి, క్రీడా ప్రాంగణాన్ని కబ్జా చేసేందుకు కొంతమంది భూ కబ్జాదారులు ప్రయత్నిస్తున్నారని భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం కబ్జాకు గురవుతున్నటువంటి స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అనేక మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందిస్తున్న ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలోని ఖాళీ స్థలం భవిష్యత్తులో క్రీడా మైదానంగా, విద్యార్థుల అభివృద్ధికి ఉపయోగపడే ఆస్తి అని పేర్కొన్నారు. అలాంటి ప్రభుత్వ భూములను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడాల్సిన స్థలాలను కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరమని, దీనిపై రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి సమగ్ర సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమి హద్దులను స్పష్టంగా గుర్తించాలని డిమాండ్ చేశారు.అలాగే కళాశాల చుట్టూ పటిష్టమైన ప్రహరీ గోడను నిర్మించి, భవిష్యత్తులో ఎలాంటి కబ్జా ప్రయత్నాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రభుత్వ భూములను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైతే, బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ప్రభుత్వ భూమి ప్రజల ఆస్తి – దానిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.












