కరీంనగర్/ జూలై 16(మా అక్షరం): రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు వారికి అభినందనలు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కోసం 2024-25 ఆర్థిక సంవత్సరానికి వచ్చే బడ్జెట్ సెషన్లో తగినంత బడ్జెట్ కేటాయింపులు జరిగేలా చూడాలని కోరుతూ రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి కోసం కేంద్ర-రాష్ట్ర సంబంధాలను మెరుగుపరచడంలో కేంద్ర ప్రభుత్వానికి తన మద్దతును అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ఈ విషయంలో రాష్ట్ర విభజన సమయంలో మన రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, వాగ్దానాలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వ నిబద్ధతగా వ్యవహరించాలని రాష్ట్రానికి కేంద్రం నిధులు తీసుకురావడంలో కేంద్ర మంత్రిగా మీ పాత్ర చాలా కీలకమైనదన్నారు. రాష్ట్ర మంత్రిగా కరీంనగర్ బిడ్డగా, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైన బడ్జెట్ కోసం చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ అభివృద్ధి పనుల గురించి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అన్నారు.స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయడం,మిడ్ మానేరు,గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసిత భాదిత కుటుంబాలకు
సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల స్థాపన, శాతవాహన విశ్వవిద్యాలయానికి 200 కోట్ల ఆర్థిక సహాయం అందించడం కొరకు,కరీంనగర్ తిరుపతి మధ్య రైల్వే మార్గం డబ్లింగ్ వేగవంతం చేయడం కొరకు, కరీంనగర్ షిర్డీ మధ్య రైల్వే మార్గం డబ్లింగ్ను వేగవంతం చేయడం,హుస్నాబాద్లో మెడికల్ కాలేజీ మంజూరు, కొత్తపల్లి నుండి జనగాం జాతీయ రహదారి మంజూరు,సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ అభివృద్ధికి నిధులు,వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి నిధులు,ఎన్ఎల్ఎమ్ పిఎమ్ఈజి ఎన్హెచ్ఎమ్ పథకాల కింద తగినంత బడ్జెట్ కేటాయింపు,రాబోయే బడ్జెట్ సమావేశాలలో పైన పేర్కొన్న అభివృద్ధి పనులను కార్యరూపం దాల్చేందుకు కరీంనగర్ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించాలని పొన్నం ప్రభాకర్ ఆ లేఖలో బండి సంజయ్ కి విజ్ఞప్తి చేశారు.











