-పోలీసు, ఎక్సైజ్ అధికారులకు కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య విజ్ఞప్తి ..
హుజురాబాద్/ జులై 16(మా అక్షరం): పట్టణంలో అంబేద్కర్ కూడలిని అనుకొని పాపారావు బొంద స్థలంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం సంఘటన పట్ల స్థానిక కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఈ అగ్ని ప్రమాద సంఘటనలో పండ్ల వ్యాపారులు,చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పాపారావు బొంద స్థలాన్ని అనుకొని మద్యం దుకాణాలు ఉన్నాయని, అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు సాగుతున్నాయని అన్నారు. నివాస, వ్యాపార కూడలలో ఉన్న మద్యం దుకాణాల కారణంగా ప్రజలు నివాసితులు మహిళలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం దుకాణం వలన రాత్రిపూట ప్రశాంత వాతావరణం దెబ్బ తింటుందని, అలాగే అపరిశుభ్ర వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. రోడ్లపైనే మద్యం తాగడం వల్ల పాదచారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇదే ప్రాంతంలో అతిపెద్ద అగ్ని ప్రమాదం జరిగి చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయిన దృష్యా పోలీసు, ఎక్సైజ్ అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఇక్కడ ఉన్న మద్యం షాపు ను రద్దుచేసి వేరే చోటికి మార్చాలని ఆమె విజ్ఞప్తి చేశారు.











