హుజురాబాద్/డిసెంబర్ 10(మా అక్షరం): తెలంగాణ విగ్రహ మార్పు పై మంగళవారం హుజరాబాద్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, బండ శ్రీనివాస్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగకముందే తెలంగాణలోని మేధావులంతా కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి ఒక చక్కటి రూపంతో పాటు దేవతా మూర్తి లాగా అలంకరణ చేసి విగ్రహాన్ని రూపొందించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లిని అవమానించేలా విగ్రహాన్ని రూపొందించారని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహంలో కాంగ్రెస్ పార్టీ హస్తాన్ని చూపించినట్టు తయారు చేయించడం హేయనీయమన్నారు.తెలంగాణ తల్లి విగ్రహ మార్పు తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించడమే అవుతుందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పులు చేసి తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీసింది అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతంలో ఉన్న మాదిరిగానే తయారుచేసి పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సంగెం ఐలయ్య, రాష్ట్ర నాయకుడు వర్ధినేని రవీందర్రావు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.











