కరీంనగర్, తిమ్మాపూర్/ డిసెంబర్10(మా అక్షరం):కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలో ఇసుక అక్రమ రవాణాపై ఊటూరు గ్రామస్తులు కన్నెర్ర జేశారు. ఊటూరు క్వారీ నుంచి పెద్ద ఎత్తున ఓవర్ లోడింగ్ తో ఇసుక అక్రమ రవాణా వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడటమే కాకుండా రోడ్లు దెబ్బతింటున్నాయంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో సోమవారం రాత్రి నుండి చేపట్టిన ఈ ఆందోళన మంగళవారం కూడా కొనసాగింది.దీంతో ఊటూరు-పచ్చునూరు గ్రామాల మధ్య ఓవర్ లోడ్ తో ఉన్న లారీలతోపాటు లోడింగ్ కోసం వెళ్లే వందలాది లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు రోడ్డుపై నిలిచిపోగా ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. ఆందోళనపై సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు, రెవెన్యూ అధికారులుగాని, మైనింగ్ అధికారులు గాని ఇప్పటి వరకు రాకపోవడంతో ఇసుక మాఫియాదారుల నుంచి పెద్ద మొత్తంలో మామూళ్ల తీసుకోవడం వల్లే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని అనుమానం వ్యక్తం చేస్తూ ప్రజలు ఆగ్రహం చెందారు.ఓవర్ లోడ్ తో వెళ్లే వాహనాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా, రోడ్లు దెబ్బతిని ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకోరా అని అధికారులను ప్రజలు సూటిగా ప్రశ్నించారు.ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు సంబంధితశాఖల అధికారులు వెంటనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని, ఓవర్ లోడింగ్ ను నియంత్రించేలా తనిఖీలు ముమ్మరం చేయాలని లేనిపక్షంలో తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని ఊటూరు-పచ్చునూరు గ్రామాల ప్రజలు హెచ్చరించారు.











