ఎల్కతుర్తి/ మార్చి 29 (మా అక్షరం): మండలంలోని పెంచికలపేట గ్రామంలో డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ ఇండియా నవక్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో శనివారం భారత సుస్థిర పత్తి యాజమాన్య పథకం పరిధిలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఫేసిలిటేటర్ రావుల లత, మాస్టర్ ఫీల్డ్ ఫీసిలిటేటర్ వంగ రఘు పాల్గొని రైతులకు కీలకమైన సమాచారాన్ని అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….రైతులు చెరువు మట్టిని తమ పొలాల్లో వేసుకోవడం ద్వారా భూమి సారవంతం పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చని వివరించారు. భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని, పరీక్షా ఫలితాల ఆధారంగా మాత్రమే ఎరువుల వాడకాన్ని కొనసాగించాలన్నారు. బీసీఐ ప్రాజెక్టు ద్వారా రైతులకు ఉచితంగా మట్టి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు నవధాన్య పప్పు జాతి పంటలు, పచ్చి రొట్టె ఎరువుల వాడకంపై కూడా రైతులకు అవగాహన కల్పించారు. నేలలో కలియ దున్నడం ద్వారా సేంద్రియ కర్బనం పెరిగి భూసార నాణ్యత మెరుగవుతుందని వివరించారు. రాబోయే సాగు సీజన్లో మంచి విత్తనాలను ఎంపిక చేసుకోవాలని, విత్తనాలు కొనుగోలు సమయంలో రసీదు తీసుకోవాలని రైతులకు సూచించారు. అనంతరం రైతు కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో 60 మంది రైతులు, రైతు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.











