– దళిత యువకుడిని చితకబాదిన ట్రైనింగ్ ఎస్ఐ భార్గవ్పై చర్యలు తీసుకోవాలి…
-టీపీసీసీ ఎస్సీ విభాగం అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జి తిప్పారపు సంపత్…
సైదాపూర్ /మే 17 (మా అక్షరం): మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన దళిత యువకుడు బత్తుల మహేందర్ను ట్రైనింగ్ ఎస్సై భార్గవ్ అమానుషంగా చితకబాదిన ఘటనపై టీపీసీసీ ఎస్సీ విభాగం అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జి తిప్పారపు సంపత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ సందర్భంగా మానవతా విలువలు విస్మరించి మానసికంగా, శారీరకంగా హింసించిన ఎస్సై భార్గవ్ పై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.భార్గవ్ తన అధికారాన్ని అతి దారుణంగా దుర్వినియోగం చేసి, మహేందర్ చెవులకు గాయాలు చేయడమే కాకుండా కర్ణభేరులు పగిలిపోయేలా కొట్టాడని, ఇది కేవలం వ్యక్తిగత దాడి కాదు – ఇది ఒక సామాజిక వర్గంపై, దళితుల మీద దాడిగా చూడాల్సిన అవసరం ఉందన్నారు .బాధితుడు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల కారణంగా సరైన వైద్యం చేయించుకోలేక బాధపడుతున్నారని అన్నారు. పోలీసు వ్యవస్థ ప్రజల రక్షణ కోసం ఉండాల్సి ఉంది కాని ఇలాంటి ఎస్సైల వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధిత దళిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సమావేశంలోఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రుద్రారపు రామచంద్రం మాదిగ,ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు తునికి వసంత్,యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కదిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు











