హుజురాబాద్ /అక్టోబర్ 27(మా అక్షరం):పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ డిగ్రీ విద్యార్థి మృతిచెందిన ఘటన విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే…. పట్టణంలోని కాకతీయ కాలనీకి చెందిన వేములవాడ రాజు, సునీత దంపతుల కుమారుడు వేములవాడ అక్షయ్ సాయి (18) కరీంనగర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. సోమవారం ఉదయం తన స్నేహితుడిని తీసుకురావడానికి బైక్పై రంగాపూర్ గ్రామానికి వెళ్తున్నాడు.ఈ క్రమంలో హుజురాబాద్లోని గెలాక్సీ సూపర్ మార్కెట్ ముందు డివైడర్లలో మట్టి పోయడానికి రోడ్డుపై నిలిపి ఉంచిన మున్సిపల్ ట్రాక్టర్ను అక్షయ్ సాయి వెనుక నుంచి ఢీకొట్టాడు. ప్రమాదంలో తలకు, శరీరానికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతన్ని వెంటనే హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అక్షయ్ సాయి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థి మృతితో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.











