-పంచాయతీ ఎన్నికలపై బీజేపీ దృష్టి…
-రేపు హుజూరాబాద్లో బూత్ అధ్యక్షులు, సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశం
ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండి సంజయ్…
హుజూరాబాద్/నవంబర్18(మా అక్షరం):డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలు జరపాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించిన నేపథ్యంలో బీజేపీ పక్షాన వేగం పెంచింది. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అధిక సంఖ్యలో సర్పంచ్, వార్డు స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో పార్టీ వ్యూహరచన చేపట్టింది.ఈ క్రమంలోనే గ్రామాలవారీగా సర్పంచ్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సర్వేలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. పార్టీ క్యాడర్ను ఎన్నికలకి సిద్ధం చేయాలన్న ఉద్దేశంతో రేపు హుజూరాబాద్ పట్టణంలోని మధువన్ గార్డెన్స్లో పోలింగ్ బూత్ అధ్యక్షులు, కార్యదర్శులు, సోషల్ మీడియా వారియర్స్తో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.సమావేశాన్ని పురస్కరించుకుని పట్టణంలో ఇప్పటికే బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లను కాషాయ జెండాలతో అలంకరించారు. దీంతో హుజూరాబాద్ పట్టణం కాషాయవర్ణంలో కళకళలాడుతోంది.రేపటి సమావేశంలో ప్రధానంగా రెండు అంశాలపై చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో క్యాడర్ సమీకరణ ఒకవైపు ఉండగా, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలన వైఫల్యాలపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.ప్రజా పాలన విజయోత్సవాలు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్సవాలకిస్తూనే, ప్రజల సమస్యలు పెరిగాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయాలపై కరపత్రాలు సిద్ధం చేసి, ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయడానికి బండి సంజయ్ ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపటి సమావేశంలో వెలువడనుంది.











