-నల్గొండలో బీసీ యువకుడిపై దాడి…
-ఖండించిన హుజురాబాద్ బీసీ జేఏసీ…
హుజురాబాద్/ డిసెంబర్ 03 (మా అక్షరం):నల్గొండ జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదగిరిపై అగ్రవర్ణానికి చెందిన సందీప్ రెడ్డి చేసిన అమానుష దాడిని హుజురాబాద్ బీసీ జేఏసీ తీవ్రంగా ఖండించింది. బుధవారం పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో బీసీ జేఏసీ అధ్యక్షుడు సందేల వెంకన్న ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ…స్వాతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు గడిచినా కుల అహంకారం, అగ్రవర్ణాల ఆగడాలు తగ్గడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం బోగరాజుపల్లి గ్రామంలో యాదవ సర్పంచ్ అభ్యర్థి నాగలక్ష్మి నామినేషన్ వేయడంతో ఆమె భర్త యాదగిరిని కిడ్నాప్ చేసి మూత్రం తాగించిన ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సందీప్ రెడ్డికి చట్టపరంగా కఠినమైన శిక్ష విధించాలనీ, రాష్ట్రంలోని బలహీన వర్గాలు ఏకమై అన్యాయాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఉప్పు శ్రీనివాస్, వడ్నాల ప్రభాకర్, కామని సమ్మయ్య, న్యాయవాది ఆళ్ళ కేశవులు, మాడుగుల ఓదెలు, రామ్ సారన్న, మధుకర్, కందుల రవీందర్ గౌడ్, శ్రీకాంత్, టి. శ్రీనివాస్ గౌడ్, శ్రీకాంత్ ముదిరాజ్, సిహెచ్. సురేష్, కె. క్రాంతి తదితరులు పాల్గొన్నారు











