-డంపింగ్ యార్డ్ ఏర్పాటును విరమించుకోవాలి…
– బిఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడవెల్లి కొండల్ రెడ్డి…
హుజురాబాద్ మార్చి 22 (మా అక్షరం): మండలంలోని సిర్సపల్లి శివారులో నిర్మించబోయే డంపింగ్ యార్డ్, విద్యుత్ ఉత్పత్తి కర్మాగార ఏర్పాటును తక్షణమే విరమించుకోవాలని బిఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడవెల్లి కొండల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని హుజురాబాద్ క్లబ్ పంక్షన్ హాల్లో పర్యావరణానికి హాని కలిగించే ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అఖిల పక్షాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన కొండల్ రెడ్డి మాట్లాడుతూ…ఈ ప్రాజెక్టు వల్ల సిర్సపల్లితో పాటు చుట్టుపక్కల పది గ్రామాల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలకు లోనయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత రైతులు వ్యవసాయ భూములు నష్టపోయే అవకాశం ఉందని, భూసారం తగ్గి పంటల దిగుబడి తగ్గిపోతుందని తెలిపారు. ప్రాజెక్టును తక్షణమే ఆపివేయాలని డిమాండ్ చేశారు.













