-కరీంనగర్లో 28న మహాగర్జన సభ … పోలాడి రామారావు…
హైదరాబాద్/ ఏప్రిల్ 10(మా అక్షరం):రైతుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 28న కరీంనగర్లో రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి “రైతు మహాగర్జన సమరభేరి” సభ నిర్వహించనున్నట్లు రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. పార్టీలకు అతీతంగా ఈ సభను నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.శుక్రవారం హైదరాబాద్లోని హిమాయత్నగర్లో రాష్ట్ర ప్రజా సంఘాల నాయకులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో సభ విజయవంతం కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై వివిధ జిల్లాల బాధ్యులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మెదక్ ఎంపీ రఘునందన్ రావును ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. సభకు మద్దతు ఇవ్వాలని కోరగా ఎంపీ సానుకూలంగా స్పందించి గర్జన గోడ ప్రతులను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….రైతులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. రుణమాఫీ కేవలం 30 శాతం రైతులకు మాత్రమే జరిగిందని, మిగతా 70 శాతం మందికి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు.రైతు భరోసా నిధులను పంటల సాగు సమయంలోనే విడుదల చేయాలని, పాల ఉత్పత్తిదారులకు గతంలో ఇచ్చిన లీటరు రూ.4 సబ్సిడీని పునరుద్ధరించాలని సూచించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని, ఓసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లు ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.అన్ని రకాల పంటలకు రూ.500 బోనస్ ఇవ్వాలని, కేవలం సన్న రకాలకే పరిమితం చేయడం తగదని పేర్కొన్నారు. రైతు భీమా వయోపరిమితిని 59 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచాలని,50 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు నెలకు రూ.6,000 పెన్షన్ ఇవ్వాలని కోరారు. యువతకు ఉపాధి అవకాశాల కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలతో పాటు ఇతర సామాజిక వర్గాల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే సమరభేరి సభ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.ఈ సమావేశంలో రైతు ప్రజాసంఘాల జాతీయ ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామి రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీహరి రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.













