-రద్దు చేయకపోతే NGT వరకు పోరాటం జక్కని సంజయ్ కుమార్ హెచ్చరిక…
హుజురాబాద్/ ఏప్రిల్ 26 (మా అక్షరం): మండలంలోని సిర్సపల్లి శివారులో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ (వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్) నిర్మించేందుకు ప్రతిపాదించిన డంపింగ్ యార్డు ఏర్పాటుపై బీసీ ఆజాది ఫెడరేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయాలని, లేకపోతే ప్రజా ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి అవసరమైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) వరకు వెళ్లి పోరాటం చేస్తామని ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోనిబీసీ ఆజాది ఫెడరేషన్ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. జనావాసాల మధ్యలో, పచ్చని పంట పొలాల మధ్య డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతుందని అన్నారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో విష వాయువులు, ప్రమాదకర రసాయనాలు విడుదలయ్యే ప్లాంట్లను నివాస ప్రాంతాలకు దూరంగా ఏర్పాటు చేయాల్సి ఉండగా, హుజురాబాద్ను లక్ష్యంగా ఎంచుకోవడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు.హుజురాబాద్ ప్రజల ప్రాణాలకు విలువ లేదన్న భావనతో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ను అమలు చేస్తే ప్రాంతాన్ని చెత్త మైదానంగా మార్చే ప్రమాదం ఉందని, ఇది అభివృద్ధి కాదని—ప్రజల ఆరోగ్యంపై దాడి అని వ్యాఖ్యానించారు.డంపింగ్ యార్డు ప్రతిపాదనను రద్దు చేయకపోతే రోడ్లపై భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తామని, అవసరమైతే న్యాయపరమైన పోరాటానికి కూడా సిద్ధమని తెలిపారు. ప్రజల ఆరోగ్యంపై రాజకీయం చేస్తే సహించబోమని హెచ్చరించారు.ఈ సమావేశంలో బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్, హుజురాబాద్ మండల అధ్యక్షుడు నడిగోటి రమేష్, ప్రధాన కార్యదర్శి మమునూరి ప్రవీణ్, ఉపాధ్యక్షుడు కొల్లిపాక క్రాంతి కుమార్, ప్రచార కార్యదర్శి పంజాల వెంకటేశ్వర్లు గౌడ్, కందుకూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు













