– బిఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడవెల్లి కొండాల్ రెడ్డి…
హుజురాబాద్ /ఏప్రిల్ 24 (మా అక్షరం):ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని బిఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడవెల్లి కొండాల్ రెడ్డి డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని కోరారు.శుక్రవారం పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల సేవలు కీలకమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా కార్మికుల సమస్యలపై స్పష్టమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కార్మికులు పలుమార్లు వినతులు సమర్పించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు.శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించి, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని కొండాల్ రెడ్డి తెలిపారు.













