హుజూరాబాద్లో డంపింగ్ యార్డ్ పై పోరాటానికి బీజేపీ సిద్ధం – బండి సంజయ్
హుజరాబాద్/ ఏప్రిల్ 24 (మా అక్షరం):హుజూరాబాద్లో డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం రద్దు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద శుక్రవారంబీజేపీ మండల, పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “ప్రజా ఆందోళన” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, డంపింగ్ యార్డు ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. జాతీయ రహదారి పక్కన యార్డు ఏర్పాటు చేయడం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామాలపై దాని ప్రభావం తీవ్రమై, కాలుష్యం పెరిగే అవకాశం ఉందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని మొదటి నుంచే వ్యతిరేకిస్తున్నానని ఆయన తెలిపారు. హుజూరాబాద్లో డంపింగ్ యార్డు ఏర్పాటు జరిగితే ప్రజలకు అనారోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని, తాగునీరు కూడా కలుషితమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. అవసరమైతే లాఠీచార్జ్లు, కేసులు, జైలుకు వెళ్లడానికీ సిద్ధమేనన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెడతామని పేర్కొన్నారు.ఇకపై న్యాయపరమైన పోరాటాన్ని కూడా ప్రారంభిస్తామని, మానవ హక్కుల కమిషన్తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లను ఆశ్రయిస్తామని తెలిపారు. త్వరలోనే గవర్నర్ను కలిసి వినతిపత్రం అందజేస్తామని చెప్పారు.హుజూరాబాద్ ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. అన్ని రాజకీయ పార్టీలతో పాటు స్థానిక ప్రజలు నెల రోజులుగా నిరసనలు తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.ముఖ్యమంత్రి వెంటనే డంపింగ్ యార్డు నిర్ణయాన్ని రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం అవుతాయని బండి సంజయ్ హెచ్చరించారు. అలాగే హుజూరాబాద్ ప్రజలు, వివిధ సంఘాల నాయకులు బీజేపీ చేపడుతున్న ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.













