హుజరాబాద్/ఏప్రిల్ 24(మా అక్షరం): ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి ఘటనపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, ఇది సాధారణ ఆత్మహత్య కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతిఫలమని విమర్శించారు.ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దురదృష్టకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు.
కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జారీ చేసిన జీఓను గుర్తుచేస్తూ, ఆ నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఆర్టీసీ అభివృద్ధి కోసం ప్రతి ఏడాది సుమారు రూ.1500 కోట్ల నిధులు కేటాయించి సంస్థను బలోపేతం చేసిన విషయాన్ని వివరించారు.ప్రస్తుతం సరైన నిధుల కొరత, సమస్యల పట్ల నిర్లక్ష్యం కారణంగా ఆర్టీసీ ఆర్థికంగా దెబ్బతింటోందని ఆయన ఆరోపించారు. ఉద్యోగ భద్రత లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేస్తూ, సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.













