-సెప్టెంబరు 2 నుంచి 8 వరకు బీఆర్ఎస్ నిరసనలు…
హుజూరాబాద్/ ఆగస్టు 31 (మా అక్షరం): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు.ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సెప్టెంబరు 2 నుంచి 8 వరకు నియోజకవర్గవ్యాప్తంగా ‘సమరభేరి’ పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ…100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వెయ్యి రోజులు పూర్తవుతున్నా హామీలను పూర్తిస్థాయిలో అమలు మండిపడ్డారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.
సెప్టెంబరు 2 – హుజూరాబాద్: ఉదయం 10 గంటలకు చౌరస్తాలో భారీ ధర్నా, బాకీల కార్డు పంపిణీ, 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన.సెప్టెంబరు 3 – వీణవంక: రైతు సమస్యలు, సాగునీరు, విద్యుత్తు, యూరియా కొరత, రైతుబీమా తదితర అంశాలపై నిరసన.సెప్టెంబరు 4 – కమలాపూర్: మహిళలకు ఇచ్చిన హామీల అమలును డిమాండ్ చేస్తూ వంటావార్పు కార్యక్రమం.సెప్టెంబరు 5 – జమ్మికుంట: ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్, నిరుద్యోగ సమస్యలపై నిరసన.సెప్టెంబరు 6: గ్రామపంచాయతీల సమస్యలు, పెండింగ్ బిల్లులు, మౌలిక వసతులపై ఆందోళనలు. హుజూరాబాద్లో ఉదయం 10, జమ్మికుంటలో 11, ఇల్లందకుంటలో మధ్యాహ్నం 12 గంటలకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆటో కార్మికులతో ర్యాలీలు చేపట్టనున్నట్లు తెలిపారు.సెప్టెంబరు 7: నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించనున్నారు.సెప్టెంబరు 8 – కరీంనగర్: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పించి కార్యక్రమాలను ముగించనున్నారు.హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నిర్వహించే కార్యక్రమాల్లో రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, కార్మికులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు












