– కరీంనగర్ జిల్లా బాలల పరిరక్షణ అధికారి శాంత
కరీంనగర్ జిల్లా/హుజురాబాద్:బాలికల రక్షణ మనందరి ధ్యేయమని కరీంనగర్ జిల్లా బాలల పరిరక్షణ అధికారి శాంత అన్నారు.కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హుజురాబాద్ పట్టణంలోని టెట్రా హెడ్రన్ మోడల్ హై స్కూల్ లో శుక్రవారం స్నేహిత అవగాహన కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా బాలల పరిరక్షణ అధికారి శాంత మాట్లాడుతూ.. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక చొరవతో వారి ఆదేశాల మేరకు స్నేహిత కార్యక్రమమును వివిధ మండలాల్లోని వివిధ పాఠశాలల్లో బాలికల యొక్క రక్షణ పరిరక్షణకు దోహదపడే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు స్మార్ట్ ఫోన్ వినియోగం,చిన్న వయసులో వాహనాలు నడపడం, డ్రగ్స్ చెడు అలవాట్లకు బానిస అవడం, బాల్యవివాహాలు, లైంగిక వేధింపులు, బాల కార్మికులు, బడి బయట ఉన్న పిల్లలు ఇలా అనేక సమస్యల నుంచి బాలలను పరిరక్షించడానికి ఈ స్నేహిత అవగాహన కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం అందరు సహకరించాలని,18 సంవత్సరాల లోపు పిల్లలకు సంబంధించి ఏదైనా సమస్య దృష్టికి వస్తే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ఉచిత నెంబర్ కు సమాచార ఇవ్వగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నరేష్,ఐసిపిఎస్ రమేష్, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సూపర్వైజర్ దూడం కుమారస్వామి, ఎం ఏ ఓ సునీల్ కుమార్, ఆర్ పి సమీనా, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.












