-అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పోరేట్ కళాశాలలకు ఇంటర్ బోర్డు అడ్డుకట్ట వేయాలి..
-ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్..
కరీంనగర్ జిల్లా/హుజూరాబాద్: జిల్లాల్లో ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఇంటర్ బోర్డు నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ముందస్తు అడ్మిషన్లు, వేసవి తరగతులు నిర్వహిస్తున్నారని, జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు వెంటనే ప్రైవేట్ జూనియర్ కళాశాలల ఆగడాలు అరికట్టాలని లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలల ముందు ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రయివేట్ జూనియర్ కళాశాలలు ఎటువంటి ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా వివిధ కోర్సుల పేరు మీద, పండగల పేరుమీద, వివిధ ఆకర్షణీయమైన పేర్లు పెట్టి విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తూ… ఫీజుల రాయితీ ఇస్తామంటూ… ఇష్టానుసారంగా అడ్మిషన్లు చేపడుతున్నా జిల్లా ఇంటర్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని,ఇప్పటికే కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులకు ఇంకా ఫలితాలు రాకముందే రెండవ సంవత్సరం తరగతులు నిర్వహిస్తూ,ఒక్కో విద్యార్ధి నుండి 50% శాతం ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. ఎటువంటి విద్యాప్రమాణాలు పాటించకుండా ఇరుకు గదులలో తరగతులు నిర్వహిస్తున్నారని, జిల్లా వ్యాప్తంగా నిబంధనలు పాటించని జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.











