హుజురాబాద్/ ఏప్రిల్ 17(మా అక్షరం):అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లంతకుంట శ్రీ సీతారామ కళ్యాణం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధికంగా పోటెత్తారు. ఈ కార్యక్రమానికి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంటు బి ఆర్ ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై శ్రీరాముని కళ్యాణానికి పట్టు వస్త్రాలు అందించారు. పండితులు శ్రీరాముని కళ్యాణ ఘట్టాన్ని పూర్తిచేసి శ్రీరాముని గొప్పతనాన్ని భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ…
శ్రీరామచంద్రుడు ప్రజలకు మార్గదర్శకుడని, రామాయణం ద్వారా ప్రజలకు ఎన్నో హితబోధలు చేశారని అన్నారు. మనిషి నడవడిక ఎలా ఉండాలో రామాయణ పారాయణం చేస్తే తెలుస్తుందని అన్నారు. శ్రీరాముని కృపాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.











