-రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు..
హుజరాబాద్/నవంబర్ 22( మాఅక్షరం ):
నిన్నమొన్నటిదాకా ప్రశాంతంగా ఉన్న జనం చలితో వణుకుతున్నారు. చలికాలం ఆరంభంలోనే చలి వణికిస్తోంది. సాయంత్రం ఏడు,ఎనిమిది కాగానే జనాలు ఇళ్లలోకి పరిమితమవుతున్నారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులతో చలి పెరగడంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు.నవంబర్ లోనే ఇంత తీవ్రంగా ఉంటే డిసెంబర్,జనవరిలో ఏ స్థాయిలో ఉంటుందో జనాలు చర్చించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ముసలివాళ్ళు పిల్లలు సీజనల్ వ్యాధుల భయంతో జంకుతున్నారు.ఉదయం 6:00 అయినా చీకటి లానే కనబడుతుంది. మంచు సైతం ఉదయం7, 8 గంటల వరకు అలానే ఉంటుంది. పెద్ద మొత్తంలో పొగ మంచు కమ్మేస్తోంది. ఇప్పటికే వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఇది ఇలానే పడిపోతుంటే ఎన్నడూ లేని విధంగా చలి తీవ్రస్థాయిలో ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు.రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతను గమనిస్తుంటే ఈసారి గత సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటుంది.అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పగటిపూట ఉష్ణోగ్రత కొంతమేరకు మెరుగ్గా ఉన్నప్పటికీ రాత్రి ఉదయం ఉష్ణోగ్రతల్లో చాలా మార్పులు వచ్చాయి. చలికాలం అలానే కొనసాగితే సీజనల్ వ్యాధులతో చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు.చాలా మంది పిల్లలు సాయంత్రం ఆటలాడటానికి బయటకెళ్తారు. అయితే చలి ప్రభావం వీరిపై అధికంగా ఉంటుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇబ్బందులు వారికి తొందరగా అందుకుంటాయి. ఈ సీజన్లో చీకటి పడే వరకు పిల్లలను ఖాళీ స్థలాల్లో అడిపించకపోవడమే మంచిది. వృద్ధులు చలి అధికంగా ఉంటే బయటకు వెళ్లకూడదు. అంటు వ్యాధులు సోకే ప్రమాదం అధికంగా ఉంటుంది.. పిల్లలను స్కూల్ కు పంపించేటప్పుడు అన్ని దుస్తులు, షూ, చేతికి గౌజ్లు, కాళ్లు, చేతులు కప్పి ఉండేలా దుస్తులు వేయడం వంటి జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీళ్లు, పరిశుభ్రమైన ఆహారం అందివ్వాలి.చలి తీవ్రంగా పెరగడంతో చిన్నపిల్లలు వృద్ధులు ఉదయం సమయంలో బయటకు రాకుండా ఉంటేనే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.











