– మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి..
కరీంనగర్, తిమ్మాపూర్/ నవంబర్ 28 (మా అక్షరం):సమాజంలోని రుగ్మతల వల్ల అన్నిరకాలుగా అణచివేత గురైన బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం పోరాడిన యోధుడు జ్యోతీరావు ఫూలే అని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కొనియాడారు. ఫూలే వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పిస్తూ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.కుల వివక్షకు వ్యతిరేకంగా పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం జ్యోతీరావు ఫూలే తెగించి పోరాడారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు చేసిన కృషి ఎంతో ఉదాత్త మైనదని ఆయన పేర్కొన్నారు. సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫూలే ఒక ముఖ్యమైన భూమిక పోషించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. దురాచారాలను రూపుమాపటానికి అహర్నిశలు కృషి చేశారని, ఎవరు ఎన్ని రకాలుగా వేధించినా లెక్క చేయక పీడిత ప్రజల కోసం సత్యశోధక్ సమాజ్ ను స్థాపించారని, అంతేకాకుండా ప్రజలను జాగృతపర్చేందుకు దీన బంధు పత్రికను వెలువరించారని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి గుర్తు చేశారు. సామాజిక రుగ్మతలను పోరుకు చదువే మార్గమని భావించిన జ్యోతీరావు ఫూలే విద్యావ్యాప్తికి, ముఖ్యంగా బహుజనలకు విద్యనందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని ఆయన కొనియాడారు. ఆ మహనీయుని ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కవ్వంపల్లి పేర్కొన్నారు.











