-మానకొండూరు శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ…
కరీంనగర్, తిమ్మాపూర్/ డిసెంబర్ 03 (మా అక్షరం): గాంధీజీ సిద్ధాంతాలనుఆసాంతం నమ్మడమే కాకుండా వాటిని ఆచరించి అనుసరించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబూ రాజేంద్రసాద్ అని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం బాబూ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పిస్తూ పత్రికా ప్రకటన జారీ చేశారు. స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీతో కలిసి నడిచిన ఏకైక వ్యక్తి రాజేంద్రప్రసాద్ అని ఆయన పేర్కొన్నారు. అటు స్వాతంత్య్ర పోరాటానికి, ఇటు ఆధునిక భారత నిర్మాణానికి వారధిగా నిలిచారని ఆయన కీర్తించారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్ గాంధేయవాదే కాకుండా గొప్ప మానవతావాది కూడా ఆయన అభివర్ణించారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన బాబూ రాజేంద్ర ప్రసాద్ రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా ఎన్నికవడం అత్యంత అరుదైన విషయమని ఆయన పేర్కొన్నారు. రాజేంద్ర ప్రసాద్ గొప్ప మేధావి అని, ఆయన మేథస్సు, ఆదర్శవంతమైన జీవితం ఎందరినో ప్రభావితులను చేశాయని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి పేర్కొన్నారు.ఆ మహనీయుని నిరాడంబరత,నిబద్ధత మ్యాంక్ ఆదర్శం కావాలని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ అందించిన సహకారం ప్రశంసనీయమైనదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.











