హుజురాబాద్/ఏప్రిల్ 16 (మా అక్షరం): వ్యవసాయ మార్కెట్ కమిటీలో, తుమ్మనపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. తూకం యంత్రాలు, తేమ యంత్రాలు పనితీరును పరిశీలించారు. కల్లాల వద్ద సన్నాలు, దొడ్డు రకం ధాన్యాలను వేరువేరుగా ఏర్పాటు చేయాలని సూచించారు. సేకరించిన వివరాలను, మిల్లింగ్ కు పంపే ధాన్యం వివరాలకు సంబంధించిన రిజిస్టర్లు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. నిర్దిష్ట తేమ శాతానికి రాగానే ధాన్యం కొనుగోలు చేయాలని, సేకరించిన ధాన్యాన్ని వెనువెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కట్టింగు, కోతలు లేకుండా కొనుగోళ్లు జరపాలని అన్నారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా తార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 48 గంటల్లోగా రైతులకు ధాన్యం వచ్చేలా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాలకు వచ్చే మహిళలకు, ఉపాధి హామీ కూలీలకు ‘ఆరోగ్య మహిళ’ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని మెడికల్ సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయి, తహసీల్దార్ కనకయ్య, ఎంపిడిఓ సునీత,మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఏఈఓ సౌమ్య ఉన్నారు.











