-పాటల పల్లకిలో 12 గంటలు పోస్టర్ ఆవిష్కరణ …
హుజూరాబాద్/ జూన్ 11(మా అక్షరం):
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న ఉద్యమ కళాకారులకు న్యాయం జరగాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు, రచయిత, గాయకుడు నేర్నాల కిషోర్ లు కోరారు. మంగళవారం హుజురాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అనేక మంది ఉద్యమ కళాకారులు కనుమరుగు కావాల్సి వచ్చిందని, వారు అర్హత ఉన్నా సరైన గుర్తింపు రాక ఉద్యోగాలు లేక బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఉద్యమ కళాకారులకు న్యాయమైన స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.తెలంగాణ ఉద్యమం కరీంనగర్ కేంద్రంగానే బలపడిందని, అందుకే జూన్ 15న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కరీంనగర్ కళాభారతిలో ‘పాటల పల్లకిలో 12 గంటలు’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు, మేధావులు, కళాకారులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా హుజురాబాద్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను కళాకారులు చక్రాల రఘు, సందమల్ల నరేష్, యాకన్న, జంగ అనిల్, పిట్టల రమేష్, విష్ణు, ఆరూరి రాజు, నగేష్, జంపన్న, బుర్ర గడ్డ రవి, గుమ్మడి జలపతి లతో కలిసి ఆవిష్కరించారు.











