-పెద్ద పాపయ్యపల్లిలో విషాదం…
హుజూరాబాద్/జూన్ 24(మా అక్షరం):
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు బాలగోని రాములు (55) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. గ్రామస్తుల కథనం మేరకు … మే 24వ తేదీన రాములు తన వృత్తి కార్యక్రమంలో భాగంగా తాడిచెట్టుపైకి ఎక్కి కళ్లుగీయుతుండగా, కాలుజారి అపస్మారకరంగా చెట్టుపైనుంచి కింద పడిపోయాడు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడటంతో 108 అంబులెన్స్ ద్వారా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం, పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి, ఆపై మెరుగైన వైద్యం కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న సందర్భంలో రాములు మంగళవారం మరణించాడు.రాములు గౌడ్ ఓ నిత్యం కష్టపడే గీత కార్మికుడిగా, తన కుటుంబ పోషణ కోసం శ్రమించేవాడని గ్రామస్థులు తెలిపారు. రెక్క ఆడితే డొక్కా ఆడే గీత కార్మిక వృత్తిలో ఉండి ప్రాణాలు కోల్పోవడం కుటుంబానికి తీరని లోటని వారు పేర్కొన్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గీత కార్మిక సంఘం నాయకులు, గ్రామస్తులు కోరారు.











