హుజూరాబాద్ /జూలై 10 (మా అక్షరం):కోతుల బారినపడి గాయాల పాలై చికిత్స పొందుతున్న తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగి బూర సుదర్శన్ గురువారం మృతి చెందారు. గత నెల రోజుల క్రితం తన ఇంటి వద్ద కోతులు దాడి చేసి కుడికాలును తీవ్రంగా కరిచాయి. గాయం సెప్టిక్ కావడంతో వరంగల్ ఏంజీఎం ఆసుపత్రిలో 20 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.సుదర్శన్ హుజూరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కోతుల వల్లే తమ కుటుంబ పెద్దను కోల్పోయామని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
కోతుల నిర్మూలనలో నిర్వాహకుల నిర్లక్ష్యం..

పట్టణ ప్రాంతంలో కోతుల బెడద రోజురోజుకు పెరిగిపోతున్నా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. ప్రతి వీధిలోనూ, ప్రతి ఇంటిలోనూ కోతుల బీభత్సం కొనసాగుతుండగా… ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.











