-నలుగురు విద్యార్థులను కొరికిన ఎలుకలు…
హుజురాబాద్/ జూలై 25 (మా అక్షరం):
పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల పాఠశాలలో ఎలుకల బెడదతో విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. శుక్రవారం ఉదయం పాఠశాల భవనంలోని ఒక గదిలోకి చొరబడిన ఎలుక నలుగురు విద్యార్థులను కొరికింది. గాయపడిన వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.సైదాపూర్ మండలానికి చెందిన ఈ గురుకులం ప్రస్తుతం హుజురాబాద్ పట్టణంలోని అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. పాఠశాల సమీపంలో రైస్ మిల్లు ఉండటం, ఆవరణలో చెత్తాచెదారం అధికంగా ఉండటంతో ఎలుకలు అధికంగా విస్తరిస్తున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రాణి మాట్లాడుతూ… ఎలుకల నివారణకు బోన్లు, వలలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గాయపడిన విద్యార్థులతోపాటు ఆ గదిలో ఉన్నవారందరికీ ముందు జాగ్రత్త చర్యగా వైద్య సేవలు అందించామని చెప్పారు.తల్లిదండ్రులు పాఠశాలలో శుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుచున్నారు.











