హుజురాబాద్/ జూలై 25 (మా అక్షరం):బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హుజురాబాద్ పట్టణంలో శుక్రవారం ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులపై హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి, మంత్రులపై తప్పుడు ఆరోపణలు చేశారని వారు ఆరోపించారు. ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా అంటూ ప్రజలను మభ్యపెట్టి గెలిచిన కౌశిక్ రెడ్డి ఇప్పుడు పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు.ఈ నేపథ్యంలో అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన నిరసన కార్యక్రమంలో కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు . చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.











