– చెన్నై నుంచి స్పెషల్ క్రేన్… రైళ్ల రాకపోకలకు తాత్కాలిక విరామం…
హుజురాబాద్/ జూలై 27 (మా అక్షరం):ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కమలాపూర్ -ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణ పనులకు మళ్లీ వేగం వచ్చింది. రైల్వే శాఖ అధీకారులు కీలకమైన గడ్డర్ల బిగింపు పనులను ఆదివారం
మధ్యాహ్నం 12 గంటల నుండి గడ్డర్ల బిగింపు విజయవంతంగా పూర్తి చేయబోతున్నారు. దీనితో ఆర్వోబీ పనుల్లో ఒక ముఖ్యమైన దశ ముగియ పోతుంది.ఈ పనుల కోసం చెన్నై నుంచి ప్రత్యేక క్రేన్ను రైల్వే శాఖ తెప్పించాల్సి వచ్చింది. రాష్ట్రంలో అవసరమైన సామగ్రి లేకపోవడంతో, మూడు గంటల పాటు రైళ్లను నిలిపివేసి గడ్డర్ల బిగింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
కేంద్ర మంత్రి హెచ్చరికల ఫలితం…
ఈ పనుల్లో ఆలస్యంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరొక నెలలో ఈ పనులు పూర్తి కాకపోతే నేనే వచ్చి కూల్చేస్తా, అంటూ ఇటీవల రైల్వే అధికారులతో సమావేశమై పదునైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
రైళ్లకు తాత్కాలిక విరామం….
చెన్నై నుంచి వచ్చిన స్పెషల్ క్రేన్ సాయంతో, స్థానికంగా ఉన్న మరో క్రేన్ను కలిపి గడ్డర్ల బిగింపు పనులు ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి దాదాపు మూడున్నర గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిపివేసి, నిష్కలుషంగా ఈ కీలక దశను పూర్తి చేయబోతున్నారు.
ఆగస్టులో పూర్తి చేసే లక్ష్యంతో….
ఈ ఘట్టం ముగిసిన తర్వాత మిగిలిన పనులేవీ పెద్దగా సమయాన్ని తీసుకోకపోవచ్చని రైల్వే అధికారులు భావిస్తున్నారు. అన్ని పనులనూ ఆగస్టు చివరినాటికి పూర్తిచేసి ప్రజలకు ఉప్పల్ ఆర్వోబీని అందుబాటులోకి తెస్తామని రైల్వే శాఖ స్పష్టం చేసింది.











