ఇసుక ట్రాక్టర్ బోల్తా – డ్రైవర్ మృతి
హుజురాబాద్/ అక్టోబర్16 (మా అక్షరం):మండలంలోని రాంపూర్ శివారులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారిపై ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదం గురువారం తెల్లవారుజామున జరిగింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన చింటూ (20) అనే యువకుడు ఇసుక ట్రాక్టర్ నడుపుతూ విలాసాగర్ నుంచి పెద్దపాపయ్యపల్లెకు ఇసుకను తరలించి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో రాంపూర్ శివారులోకి రాగానే, నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారిపై ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది.దీంతో ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయిన డ్రైవర్ చింటూ తీవ్ర గాయాలపాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.











