-తండ్రి పక్షవాతం… కొడుకు ఉరి!…
-హుజురాబాద్లో విషాదం..
హుజురాబాద్/అక్టోబర్ 18 (మా అక్షరం):పట్టణంలోని కొత్తపల్లి- ఇంద్రానగర్ కాలనీలో జరిగిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఐటీఐ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.వివరాల్లోకి వెళ్తే, అదే కాలనీలో నివసిస్తున్న మోరే నాగరాజు కుమారుడు మోరే రిషి (20) జమ్మికుంటలోని గాయత్రి ఐటీఐ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రిషి ఫ్యాన్కు తాడుతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దృశ్యం గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.రిషి తండ్రి నాగరాజు పక్షవాతంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు పొందడంతో కొత్త ఇల్లు నిర్మాణం కొనసాగుతోంది. అయితే రిషి ఇటీవలి కాలంలో మానసిక ఒత్తిడికి గురయ్యారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.మరోవైపు ప్రేమ వ్యవహారం లేదా ఇతర వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రిషి మరణానికి గల నిజమైన కారణాలు పోస్టుమార్టం నివేదికతో స్పష్టతకు వచ్చే అవకాశం ఉందని పలువురు అనుకుంటున్నారు











