హుజురాబాద్/ అక్టోబర్ 31 (మా అక్షరం):భీమదేవరపల్లి మండలంలోని వంగర గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని శ్రీ వర్షిత కుటుంబాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి ఆవేదనను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో వేలాది మధ్యతరగతి కుటుంబాల పిల్లలు చదువుకుంటున్నారు. ఎంతో మంచి ఆలోచనతో ఈ పాఠశాలలు ప్రారంభమైనా, ప్రస్తుతం డైట్ చార్జీలు రాకపోవడం, సిబ్బంది లేకపోవడం, వార్డెన్లు లేకపోవడం వంటి సమస్యలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఉపాధ్యాయులే పిల్లలను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అన్నారు.అలాగే, 600 మంది విద్యార్థులు ఉన్నచోట ఆరోగ్య పరీక్షలు, మానసిక ఒత్తిడి నివారణ చర్యలు ఉండాలి. సైకియాట్రిస్టులతో విద్యార్థులు ఇంటరాక్ట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని గతంలోనే సూచించాం. ఫెసిలిటీస్, కోఆర్డినేషన్ లేకపోవడంతో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటివి జరిగితే ప్రభుత్వం పైపైన ఎంక్వైరీలు వేసి బాధ్యతను పిల్లలపైనే నెట్టేస్తోంది. వర్షిత చదువులో మంచి పేరు తెచ్చుకున్న అమ్మాయి, టెన్షన్ లేకుండా సదా ఉత్సాహంగా ఉండేది. అలాంటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం వెనుక బలమైన కారణాలు ఉంటాయి. వాటిని తెలుసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.











