-పీవీ విగ్రహం ఏర్పాటు శుభపరిణామం…
-పీవీ తనయుడు ప్రభాకర్ రావు…
హుజురాబాద్ /డిసెంబర్ 16(మా అక్షరం):భారతరత్న, భారతదేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని హుజురాబాద్ పట్టణంలో ఏర్పాటు చేయడం శుభసూచకమని, ఇది శుభపరిణామమని ఆయన తనయుడు పీవీ ప్రభాకర్ రావు అన్నారు. పట్టణానికి చెందిన పీవీ సేవాసమితి, అలయన్స్ క్లబ్ ప్రతినిధులు మంగళవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో పీవీ ప్రభాకర్ రావును కలసి, ఈ నెల 21న (ఆదివారం) హుజురాబాద్లో నిర్వహించనున్న పీవీ నరసింహారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా ఆహ్వానపత్రికను అందజేశారు.ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ… పీవీ నరసింహారావు అపారమైన రాజకీయ చతురత, ఆయన తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలు, అలాగే ఆయన జీవిత చరిత్ర వర్తమాన, భవిష్యత్ తరాలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.హుజురాబాద్ పట్టణంలో పీవీ విగ్రహం ఏర్పాటు ఎంతో అవసరమని పేర్కొంటూ,ఇందుకు సహకరిస్తున్న నిర్వాహకులను అభినందించారు.పీవీ సేవాసమితి, అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమానికి తాను తప్పకుండా హాజరవుతానని ప్రభాకర్ రావు తెలిపారు.ఈ కార్యక్రమంలో పీవీ సేవాసమితి అధ్యక్షుడు తూము వెంకట రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.మనోజ్ తదితరులు పాల్గొన్నారు.











