-ఎన్ఏసీ ద్వారా మహిళా శక్తి అభివృద్ధి లక్ష్యం….
-బి.ఎన్. రావు హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డా. బి.ఎన్. రావు…
హుజురాబాద్ /జనవరి 08 (మా అక్షరం):పట్టణంలోని కేసీ క్యాంప్ ఆవరణలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఏసీ) కార్యాలయంలో, బి.ఎన్. రావు హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ డా. బి.ఎన్. రావు తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడటమే ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని మహిళలు తమ జీవితాల్లో ముందడుగు వేయాలని సూచించారు. శిక్షణతో పాటు పేద మహిళలకు కుట్టు మిషన్లు అందించి ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ మాట్లాడుతూ, మహిళల సాధికారతకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలతో మహిళలు సంపూర్ణ స్వయం ఉపాధి సాధించి కుటుంబాభివృద్ధికి దోహదపడాలని సూచించారు. ఎన్ఏసీ, బి.ఎన్. రావు హెల్త్ ఫౌండేషన్ సంయుక్తంగా చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు.ఎన్ఏసీ అసిస్టెంట్ డైరెక్టర్ జి. రమేష్ మాట్లాడుతూ, నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడమే ఎన్ఏసీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఫౌండేషన్తో కలిసి మహిళల కోసం శిక్షణలు నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. గురువారం కేసీ క్యాంప్లో నెల రోజుల పాటు ఉచిత కుట్టు శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే రెండో బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఏసీ సిబ్బంది సబిత, అధం తదితరులు పాల్గొన్నారు.











