హుజురాబాద్/జనవరి 10(మా అక్షరం): గ్రహోపకర వంట గ్యాస్ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ ప్రమాణీకరణ ఈ–కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని తెలంగాణ వంట గ్యాస్ డీలర్ల అధికార ప్రతినిధి పి.వి. మదన్ మోహన్ రావు తెలిపారు.ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులతో పాటు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల ద్వారా వంట గ్యాస్ పొందుతున్న వినియోగదారులందరికీ ఈ–కేవైసీ అవసరమని చెప్పారు. గతంలో డిసెంబరు 31లోగా ఈ–కేవైసీ పూర్తి చేయాలని సూచించినప్పటికీ, పూర్తి చేయని వారికి మరో అవకాశం ఇస్తూ జనవరి 31వరకు గడువు పెంచినట్లు తెలిపారు. OMC,UIDAI యొక్క ఆధార్ ముఖ గుర్తింపు ఆప్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఇచ్చిన క్యూ ఆర్ కోడ్ పొందుపరిచారని దానిని స్కాన్ చేసుకోవచ్చని లేదా https:www.pmuy.gov.in/e-kyc.html సందర్శించి సదుపాయం పొందవచ్చు అన్నారు. గ్యాస్ కలెక్షన్ పొందిన ఏజెన్సీలలో డెలివరీ బాయ్ ద్వారా ఈ కేవైసీ చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. గడువు లోపు ఈ–కేవైసీ చేయించుకోకపోతే గ్యాస్ రాయితీలు నిలిచిపోవడమే కాకుండా కనెక్షన్లు రద్దయ్యే అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాల కోసం ఆయిల్ పరిశ్రమ టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్18002333555 ను సంప్రదించాలని సూచించారు.
కాలం చెల్లిన రబ్బరు పైపులు వాడవద్దు..
నాణ్యత ప్రమాణాలు లేని లేదా కాలం చెల్లిన రబ్బరు పైపుల వాడకం వల్ల గ్యాస్ ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రభుత్వం ఆమోదించిన సురక్ష రబ్బరు పైపులనే వినియోగించాలని, ఐదు సంవత్సరాల గడువు ముగిసిన పైపులను వెంటనే మార్చుకోవాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలు లేని పైపులు వాడితే ప్రమాద బీమా వర్తించదని అన్నారు.











