-గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క– సారలమ్మలు…
-రంగనాయకుల గుట్ట వద్ద వైభవంగా ప్రారంభమైన జాతర….
హుజూరాబాద్/ జనవరి 29 (మా అక్షరం):తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క–సారలమ్మ జాతర హుజూరాబాద్ పట్టణ శివారులోని రంగనాయకుల గుట్ట సమీపంలో భక్తుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా ప్రారంభమైంది.జాతరలో కీలక ఘట్టమైన మొదటి దశలో బుధవారం రోజున భక్తిశ్రద్ధల నడుమ సారలమ్మ గద్దెలపైకి చేరుకున్నారు. అనంతరం గురువారం రోజున పెద్ద పాపయ్యపల్లి గ్రామం నుంచి సమ్మక్కను కోయ పూజారులు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా రంగనాయకుల గుట్ట వద్దకు తీసుకొచ్చారు.ఈ సందర్భంగా శివసత్తుల పూనకాలు జోరుగా సాగగా, భక్తుల నినాదాలతో పరిసరాలు మార్మోగాయి. గద్దెపైకి సమ్మక్కను ప్రతిష్ఠించే ముందు కోయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయకుల గుట్ట వద్ద ఏర్పాటు చేసిన గద్దెలపై సమ్మక్కను కొలువుదీర్చడంతో జాతర ఘట్టం అధికారికంగా ప్రారంభమైంది.అమ్మ వారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. కుంకుమ, పసుపు, బెల్లం (బంగారం) తీసుకొచ్చి మొక్కులు చెల్లించుకుంటూ భక్తిశ్రద్ధలు వ్యక్తం చేశారు. జాతర ప్రారంభంతో హుజూరాబాద్ పరిసర ప్రాంతాలు భక్తిమయ వాతావరణంతో నిండిపోయాయి.











