-స్ట్రాంగ్ రూమ్ ఘటనపై పూర్తి విచారణ జరగాలి…
-హుజురాబాద్ ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు…
-ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి…
హుజురాబాద్/ ఫిబ్రవరి14 (మా అక్షరం): హుజురాబాద్ కేంద్రంలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యంపై తీవ్రమైన అనుమానాలు కలిగిస్తున్నాయని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఎన్నికల కౌంటింగ్ పూర్తికాకముందే కాంగ్రెస్ నాయకులు సీట్లపై ముందస్తు ప్రకటనలు చేయడం సాధారణ రాజకీయ అంచనా కాదని, ఇది మ్యాచ్ ఫిక్సింగ్లా కనిపిస్తోందని అన్నారు.
ముందుగా ప్రకటించిన స్థానాలే తుది ఫలితాల్లో రావడం అనుమానాలకు తావిస్తున్నదన్నారు. స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టడం, సీసీటీవీ ఫుటేజ్ తొలగింపుతో మొత్తం ఎన్నికల ప్రక్రియపై సందేహాలు మరింత బలపడుతున్నాయని పేర్కొన్నారు.స్ట్రాంగ్ రూమ్ తాళం చెవిని సైతం కాపాడలేని పరిస్థితిలో పోలింగ్ బాక్సుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. ఒక్క రోజులోనే తాళాలు పోయాయని ప్రచారం చేయడం అధికారుల పనితీరుపై అనుమానాలు కలిగిస్తోందన్నారు.నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల తరఫున పోలీసు అధికారులు, ఎన్నికల యంత్రాంగం ఎవరి కోసం పనిచేస్తున్నారో స్పష్టం చేయాలని కోరారు.ఈ ఘటనపై పూర్తి సీసీటీవీ డేటా రికవరీ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఎన్నికల ప్రక్రియపై పునర్విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.ఎన్నికలు ప్రజల తీర్పు అని, ఆ తీర్పును ప్రభావితం చేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. హుజురాబాద్ ప్రజల హక్కుల కోసం తాను ఎప్పుడూ పోరాడుతానన్నారు.











