-అనుభవంలేని వారికి ఇంటర్ మూల్యాంకన విధులు?విద్యార్థి సంఘాల ఆందోళన…
కరీంనగర్/ మార్చి 11 (మా అక్షరం): రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 4వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ సంస్కృతం పేపర్ల మూల్యాంకనం ప్రారంభమైంది. అయితే కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న మూల్యాంకనంలో నిబంధనలకు విరుద్ధంగా అనుభవంలేని వారిని అసిస్టెంట్ ఎగ్జామినర్లుగా నియమించారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం కనీసం రెండు సంవత్సరాల బోధన అనుభవం లేదా ఇంటర్ మూల్యాంకనంలో రెండు సంవత్సరాల స్క్రుటినీ అనుభవం ఉన్న లెక్చరర్లను మాత్రమే అసిస్టెంట్ ఎగ్జామినర్లుగా నియమించాలి. అయితే జీరో సర్వీస్ ఉన్న కొందరిని కూడా ఈ విధులకు నియమించినట్లు విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో మూల్యాంకనంలో తప్పిదాలు జరిగితే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన మంచిర్యాల ఘటన మళ్లీ పునరావృతం అయితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించకుండా మూల్యాంకనం జరుగుతుందనే ఆరోపణలపై తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ మూల్యాంకన కేంద్రంలో జరుగుతున్న వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు కార్యదర్శిని కోరుతున్నారు













