భీమదేవరపల్లి/ మార్చి 23 (మా అక్షరం): మండలంలోని మంగళపల్లి స్టేజి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకుల జీవితాలు క్షణాల్లో మారిపోయాయి.వివరాల్లోకి వెళ్తే సోమవారం మంగళపల్లి గ్రామానికి చెందిన అంబాల రాజు హుస్నాబాద్ వైపు తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన కదిరే కిరణ్ లిఫ్ట్ అడిగాడు. గ్రామం వారే కావడంతో రాజు ఆపి అతడిని ఎక్కించుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఆ క్షణాల్లోనే వెనుక నుండి వేగంగా వచ్చిన టిప్పర్ లారీ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.ఈ దుర్ఘటనలో కదిరే కిరణ్ (28) అక్కడికక్కడే మృతి చెందగా, అంబాల రాజు (29) తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి తరలించబడ్డాడు.కళ్ల ముందే జరిగిన ఈ ప్రమాదం స్థానికులను కలచివేసింది. కాసేపటి క్రితమే మాట్లాడుకున్న స్నేహితుడు ఇలా కన్నుమూయడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కిరణ్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ,బాధిత కుటుంబ సభ్యులు మృతదేహంతో రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితులను సమాధానపరచి,పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.దీంతో హనుమకొండ హుస్నాబాద్ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు క్రమంగా పునరుద్ధరించబడ్డాయి.మనుషుల మధ్య ఉన్న చిన్న అనుబంధం… ఒక లిఫ్ట్ రూపంలో మొదలై, క్షణాల్లోనే విషాదంగా మారిన ఈ ఘటన అందరినీ కలచివేస్తోంది.













