హుజురాబాద్ /మార్చి 28 (మా అక్షరం): పట్టణంలో ప్రతిపాదిత డంప్ యార్డ్కు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్టూనిస్ట్ కొండా రవి ప్రసాద్ వినూత్నంగా కార్టూన్ల ప్రదర్శన నిర్వహించారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.
డంపింగ్ యార్డ్ వల్ల కలిగే పర్యావరణ, ఆరోగ్య సమస్యలను తన కార్టూన్ల ద్వారా స్పష్టంగా చూపిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన చేపట్టినట్లు రవి ప్రసాద్ తెలిపారు. “నా ప్రాంతానికి అన్యాయం జరిగితే స్పందించడం ఒక కళాకారుడిగా నా బాధ్యత” అని ఆయన పేర్కొన్నారు.ప్రదర్శనలో ఉంచిన కార్టూన్లు డంప్ యార్డ్ వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రతిబింబిస్తూ, సమస్య తీవ్రతను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాయి. కార్యక్రమానికి హాజరైన వారు ఈ వినూత్న ప్రయత్నాన్ని అభినందిస్తూ, సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












