హుజురాబాద్/ ఏప్రిల్ 02 (మా అక్షరం): పట్టణ పరిసర ప్రాంతాల్లో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ను రద్దు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని టీపీసీసీ ఎస్సీ విభాగం అట్రాసిటీస్ రాష్ట్ర ఇన్చార్జ్ తిప్పరపు సంపత్ కోరారు. ఈ మేరకు ఆయన వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ప్రజల అభిప్రాయాన్ని పక్కన పెట్టి హుజురాబాద్ సమీపంలోని సిర్సపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు భూములు కేటాయించారని తెలిపారు. సర్వే నెంబర్ 496లో 23.20 గుంటలు, సర్వే నెంబర్ 270లో 1.20 గుంటలు కలిపి సుమారు 25 ఎకరాల భూమిని గుర్తించారని పేర్కొన్నారు.కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి చెత్తను తరలించి అక్కడ వేయడం, వ్యర్థాలను కాల్చడం వల్ల తీవ్ర కాలుష్యం ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత పరిసరాల్లో సుమారు 50 వేల మంది ప్రజలు నివసిస్తున్నారని, డంపింగ్ యార్డ్ వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని తెలిపారు.ఇప్పటికే స్థానికులు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు, నిరాహార దీక్షలు చేపడుతున్నారని ఆయన చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను తక్షణమే రద్దు చేసి ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.













