హుజురాబాద్/ ఏప్రిల్ 02 (మా అక్షరం): మండలంలోని సిర్సపల్లి శివారులో ప్రతిపాదిత వేస్ట్ టు ఎనర్జీ పవర్ ప్రాజెక్టు (డంపింగ్ యార్డ్)ను రద్దు చేయాలని రాంపూర్ గ్రామపంచాయతీ తీర్మానం చేసింది. అఖిలపక్ష జేఏసీ ఆదేశాల మేరకు గ్రామసభలో వార్డు సభ్యులు, గ్రామ ప్రజల ఆమోదంతో తీర్మానాన్ని ఆమోదించి జేఏసీ కమిటీకి అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముషం సంగీత గణేష్, ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వన్నాల శివాజీతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రజల ఆరోగ్య హక్కులను కాపాడే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 39(c), 42, 47లను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని విమర్శించారు.తొమ్మిది పట్టణాల నుంచి సుమారు 20 లక్షల జనాభా చెత్తను సేకరించి ఇక్కడ డంప్ చేసి, దాన్ని మండించి 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ప్రణాళిక వల్ల తీవ్ర కాలుష్యం ఏర్పడి ప్రజలు అనారోగ్యానికి గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం సరైంది కాదన్నారు.డంపింగ్ యార్డ్ను వెంటనే రద్దు చేయాలని, రద్దు అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.













