అకినేపల్లి అర్ధనగ్న దీక్ష… డంపింగ్ యార్డు రద్దు చేయాలంటూ ఉదృత నిరసన
హుజూరాబాద్/ ఏప్రిల్ 05 (మా అక్షరం):మండలంలోని సిర్సపల్లి శివారులో ప్రతిపాదిత డంప్ యార్డ్ నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అకినేపల్లి రమేష్ అర్ధనగ్న దీక్ష చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హాజరై మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, పర్యావరణ నిబంధనలు పాటించకుండా గుట్టుచప్పుడు కాకుండా వేస్ట్ టు ఎనర్జీ డంపింగ్ యార్డు నిర్మాణానికి ప్రయత్నించడం అన్యాయమన్నారు. రెండు వారాల్లోగా డంపింగ్ యార్డు రద్దు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ ఉద్యమ తరహాలో తీవ్ర ఆందోళనలు చేపట్టి, వేలాది మందితో హుజురాబాద్ హైవేను అష్టదిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు.అంబేద్కర్ విగ్రహం ఎదుట అర్ధనగ్న దీక్ష చేస్తున్న అకినేపల్లి రమేష్ను స్థానిక నాయకులు గందే శ్రీనివాస్, పొరెడ్డి శంతన్ రెడ్డి తదితరులు ఒప్పించి దీక్షా శిబిరానికి తరలించారు.
గత 14 రోజులుగా వివిధ రూపాల్లో డంపింగ్ యార్డు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని రామారావు ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తే, పచ్చని పంట పొలాలు కాలుష్యంతో నాశనం అవుతాయని, ప్రాంతం విషతుల్యమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఎంతటి పరిస్థితులైనా ఎదుర్కొని డంపింగ్ యార్డు నిర్మాణాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘాల డివిజన్ అధ్యక్షుడు సుద్దాల హరిశంకర్, కార్యదర్శి నూనె శ్రీనివాస్, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కార్పొరేటర్లు గందే శ్రీనివాస్, వర్ధినేని రవీందర్ రావు, ఎడవెల్లి కొండాల్ రెడ్డి, పొరెడ్డి శంతన్ రెడ్డి, రాజేశ్వర్ రావు, చందా చంద్రగుప్త, అకినేపల్లి రమేష్, పల్కల ఈశ్వర్ రెడ్డి, కట్కూరి మల్లారెడ్డి, బెల్లి రాజయ్య, కిరాణ వర్తక సంఘం అధ్యక్షుడు శీల రాజేంద్ర ప్రసాద్, కార్యదర్శి యాంసాని శశిధర్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమురవెల్లి హరిప్రసాద్, హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.













