-ప్రణవ్ ఆధ్వర్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను కలిసిన డంప్ యార్డ్ జేఏసీ నాయకులు,మున్సిపల్ పాలకవర్గం…
– డంప్ యార్డ్ తరలింపునకు కృషి చేయాలని కోరిన నాయకులు….
– సానుకూలంగా స్పందించిన జిల్లా ఇంచార్జి మంత్రి…
హైదరాబాద్/హుజరాబాద్ ఏప్రిల్ 07 (మా అక్షరం):వెస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ద్వారా హుజురాబాద్ ప్రాంతం తీవ్రంగా నష్టపోతుందని,ప్రజల ఆరోగ్యమే కాకుండా సారవంతమైన నేల కలిగిన హుజూరాబాద్,సిర్సపల్లి ప్రాంతం కాలుష్య కోరల్లో చిక్కుకుంటదని హుజూరాబాద్ డంప్ యార్డ్ జేఏసీ నాయకులు,హుజూరాబాద్ మున్సిపల్ పాలకవర్గం అన్నారు.మంగళవారం రోజున సెక్రటేరియట్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాంబర్ లో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు,పాలకవర్గం,మున్సిపల్ పరిధిలోని నాయకులతో మంత్రిని కలిశారు.ఈ సందర్భంగా మంత్రికి వినతి పత్రం అందజేశారు.ఈ విషయమై ఇప్పటికే మున్సిపల్ పాలకవర్గం ఈ డంప్ యార్డును వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారని ఆ విషయాన్ని మంత్రికి వివరించారు.వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ వేరే చోటుకు తరలించాలని,ఈ ప్రాంత భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని సానుకూల ప్రకటన చేయాలని జేఏసి నాయకులు కోరగా సానుకూలంగా స్పందించిన మంత్రి ఇప్పటికే ఈ విషయంపై ప్రణవ్ నా దృష్టికి తీసుకువచ్చాడని తప్పకుండా ముఖ్యమంత్రితో మాట్లాడి కృషిచేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని,కౌన్సిలర్లు,జేఏసీ నాయకులు,కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు,మున్సిపల్ పరిధి నాయకులు పాల్గొన్నారు.













