-సెక్రటేరియట్లో తుమ్మల నాగేశ్వరరావును కలిసిన జేఏసీ నాయకులు, మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని…
హుజురాబాద్/ఏప్రిల్ 08 (మా అక్షరం): మండలంలోని సిర్సపల్లి శివారులో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ (వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్) రద్దు అంశంపై మున్సిపల్ చైర్పర్సన్ రెంటాల సుహాసిని ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, జేఏసీ నాయకులు చర్యలు వేగవంతం చేశారు. ఈ క్రమంలో మంగళవారం సెక్రటేరియట్లో కరీంనగర్ జిల్లా ఇన్చార్జి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సిర్సపల్లిలో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డ్ వల్ల కలిగే అనర్థాలు, ప్రజల ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని వివరించామని తెలిపారు. దీనిపై తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించి, సమస్యను సంబంధిత మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తానని హామీ ఇచ్చారని చెప్పారు.హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డిని కూడా కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. త్వరలో జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం ఇవ్వడంతో పాటు సిర్సపల్లి ప్రాంతాన్ని సందర్శించాలని కోరనున్నట్లు వెల్లడించారు.డంపింగ్ యార్డ్ను ఇతర ప్రాంతానికి తరలించే వరకు జేఏసీ, అఖిలపక్ష నాయకులకు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేవలం నిరసనలు మాత్రమే కాకుండా, సంబంధిత మంత్రులను కలిసి సమస్యను వివరించడం ద్వారా పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలిచే ప్రభుత్వం అని పేర్కొంటూ, సిర్సపల్లి గ్రామంలో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ను తప్పక మరొక చోటుకు తరలిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.













